నిజామాబాద్ : క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతున్న బాలికకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేందర్గౌడ్ కూతురు కంచర్ల అఖిల (16) కొన్ని రోజులుగా క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతుంది. చికిత్స కోసం ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ను కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా మంత్రి కేటీఆర్కు సహాయం చేయాల్సిందిగా కోరారు.
స్పందించిన మంత్రి రూ. 10 లక్షలను వైద్య ఖర్చులకోసం నిధులు మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును ఎమ్మెల్సీ కవిత గురువారం నిజామాబాద్లో ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఆపదలో ఉన్నా కుటుంబానికి అండగా ఉండి ఆదుకున్నందుకు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సురేందర్కు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.