గర్మిళ్ల : సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ చేయిస్తామని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటి 61 లక్షలను వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్ళను సీసీసీ నస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మారగోని శ్రీనివాస్ గౌడ్, నక్క రాజా జ్ఞానసాగర్, గుసుకొండ రవికాంత్ శర్మ ఉన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ హోటల్ నిర్వహస్తుండడంతో సింగరేణి ఉద్యోగులతో పరిచయం ఏర్పడింది.
కొన్ని రోజుల తరువాత హోటల్ నడవక పోవడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఆటోతో వచ్చే డబ్బులు సరిపోక కుటుంబ పోషణ కష్టం కావడంలో హైదరాబాద్కు మకాం మార్చాడు. అక్కడ రంగారెడ్డి జిల్లా సరూర్నగర్కు చెందిన రవికాంత్ శర్మతో పరిచయమైంది. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ చేయిస్తామని నమ్మిస్తే కార్మికులు అడిగినన్ని డబ్బులు ఇస్తారని, అలా చేస్తే వాటా ఇస్తానని రవికాంత్ శర్మకు శ్రీనివాస్ గౌడ్ చెప్పడంతో అంగీకరించాడు. దీంతో ఇద్దరు కలిసి కలిసి మేడ్చల్లోని ఐ సెక్యూరిటీ సర్విసెస్ మేనేజర్ నక్క రాజా జ్ఞానసాగర్ తో కలిసి మంచిర్యాల, మందమర్రి, సీసీసీ నస్పూర్, గోదావరి ఖని, 8 ఇంక్లెన్ కాలనీ ఏరియాలకు చెందిన సింగరేణి కార్మికులకు మాయ మాటలు చెప్పి సింగరేణిలో అన్ఫిట్ చేయిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారు.
అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, యాదగిరి లక్ష్మీనరసంహాస్వామి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పేరిట హైదరాబాద్కు చెందిన పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై జితేందర్ పాల్గొన్నారు.