కోల్కతా: గేమింగ్ యాప్ స్కామ్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చురుగ్గా దర్యాప్తు చేస్తున్నది. నిందితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో శనివారం ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ బృందం, గార్డెన్ రీచ్ ప్రాంతంలోని వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంలో సోదాలు చేసింది. రూ.17 కోట్ల నగదుతోపాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. రైడ్ ఇంకా కొనసాగుతున్నది. స్వాధీనం చేసుకున్న నగదు లెక్కింపు కోసం క్యాష్ కౌంటింగ్ యంత్రాలను ఈడీ అధికారులు రప్పించారు. మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.
‘ఈ-నగ్గెట్స్’ అనే మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా భారీ మోసానికి పాల్పడ్డారు. తొలుత వినియోగదారులకు రివార్డులు, కమీషన్ ఇచ్చారు. బ్యాలెన్స్ డబ్బులను వ్యాలెట్ ద్వారా తీసుకునే సౌకర్యం కల్పించారు. దీంతో నమ్మకంతో యూజర్లు భారీగా కమీషన్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులతో ఆర్డర్లు కొనుగోలు చేశారు. ఇలా ప్రజల నుంచి కోట్లలో డబ్బులు జమ అయిన తర్వాత ఒక్కసారిగా డబ్బులు విత్ డ్రాను నిలిపివేశారు. సిస్టమ్, సర్వర్ అప్గ్రేడ్ పేరుతో ప్రొఫైల్స్తోపాటు డాటా అంతా తొలగించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, మొబైల్ గేమింగ్ యాప్ వినియోగదారులను మోసం చేసిన నిందితుడు అమీర్ ఖాన్, ఇతరులపై ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసాలపై దాడులు చేసి కోట్లలో డబ్బులు, ఇతర ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది.
#WATCH | Kolkata, WB: Stacks of cash amounting to several crores have been recovered from the residence of businessman Nisar Khan during ED's raid ongoing for several hours pic.twitter.com/o2qXzNSmDR
— ANI (@ANI) September 10, 2022