Air India | రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్లో వైద్య విద్యార్థులతోపాటు సుమారు 16 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోనే ఎక్కువగా రష్యా సైన్యం దాడులు చేస్తున్నది. యూరప్ దేశాల వైపు అంటే పశ్చిమ దిక్కున దాడులు తక్కువ. దీంతో వెస్ట్ ప్రాంతాలకు పాస్పోర్టు తదితర కీలక పత్రాలతో తరలి రావాని ఉక్రెయిన్లో చిక్కుకున్న ఇండియన్స్కు కేంద్రం సూచించింది.
ఉక్రెయిన్కు పశ్చిమ సరిహద్దుల నుంచి ఎయిరిండియా విమానాల్లో ఇండియన్స్ను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో విమాన ప్రయాణ ఖర్చు రూ.1.10 కోట్ల పై చిలుకే. ఆయా విమానాల గడువును బట్టి ఖర్చు కూడా పెరుగుతుంది. ఎయిరిండియా రొమేనియా, హంగరీ తదితర ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి డ్రీమ్ లైనర్ అని పిలిచే బోయింగ్ 787 విమానంతో సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందల మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు.
బోయింగ్ 787 చార్టర్డ్ విమానం ఖర్చు గంటకు రూ.7-8 లక్షలు ఖర్చవుతుందని పలు ఎయిర్లైన్స్ చెబుతున్నాయి. బుడాపెస్ట్, బుకారెస్ట్ల నుంచి ఢిల్లీ వరకు విమాన ప్రయాణానికి ఆరేడు గంటల టైం పడుతుంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ నివేదిక ప్రకారం బుడాపెస్ట్ నుంచి ముంబైకి విమానం చేరుకోవడానికి దాదాపు 6 గంటల టైం పట్టింది. దీని ప్రకారం ఒక రౌండ్ ట్రిప్ కోసం ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో విమానం ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలు, నావిగేషన్ చార్జీలు, ఇంధన ఖర్చు, సిబ్బంది ఖర్చు తదితరాలు కలిసి ఉంటాయి.
ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపుకయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తున్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ వారి ప్రయాణ ఖర్చులు భరించడానికి ముందుకొచ్చాయి. ఇక ఈ డ్రీమ్లైనర్ విమానంలో 250కి పైగా సీట్లు ఉంటాయి. సగటున గంటకు ఐదు టన్నుల ఇంధనం అవసరం. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఖర్చు మొత్తం టాటా సన్స్కు కేంద్రం చెల్లించనుందని సమాచారం.