టైమ్స్ కథనంతో తారస్థాయికి విమర్శలు
సిబ్బందిపై మెఘన్ వేధింపులంటూ వార్తలు
అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారన్న యువరాణి
లండన్, మార్చి 4: బకింగ్హమ్ప్యాలెస్కు ప్రిన్స్ హ్యారీ జంటకు మధ్య విభేదాలు బ్రిటన్ రాజకుటుంబం ఇంటి పోరు రచ్చకెక్కింది. రాజసౌధం నుంచి బయటకు వచ్చిన ప్రిన్స్ హ్యారీ-మెఘన్ మార్కెల్ జంటకు, రాజకుటుంబానికి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఎక్కువయ్యాయి. వీటిని టైమ్స్ పత్రిక ప్రచురించిన తాజా కథనం మరో మెట్టు ఎక్కించింది. తన భర్త, బ్రిటన్ యువరాజు హ్యారీతో కలిసి రాజసౌధంలో ఉన్న సమయంలో మెఘన్.. అక్కడి సిబ్బందిని వేధించారని, వేధింపులు తాళలేక ఇద్దరు ఉద్యోగం మానేశారని టైమ్స్ ఇటీవల కథనం ప్రచురించింది. ఈ ఆరోపణలపై రాజకుటుంబం నివాసం ఉండే బకింగ్హామ్ ప్యాలెస్ స్పందించింది. ఆరోపణలపై దర్యాప్తును ప్రారంభించింది. ‘టైమ్స్ కథనాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం.
సిబ్బందిపై వేధింపులు ఆందోళనకరం. దీనిపై మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా అప్పుడు పనిచేసిన సిబ్బందిని పిలిపిస్తాం. వేధింపులను సహించబోం’ అని రాజసౌధం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఆరోపణలను మెఘన్ తోసిపుచ్చారు. రాజకుటుంబం, సిబ్బంది తమపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ప్రఖ్యాత టెలివిజన్ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలను చెప్పారు. ‘వాళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే మేం మౌనంగా ఉంటామని వారు ఎందుకు అనుకొంటున్నారో అర్థం కావడం లేదు’ అని రాజకుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే.. బ్రిటిష్ మీడియా మానసిక హింస, రాజకుటుంబపు కట్టుబాట్లను తట్టుకోలేకే తాము రాజకుటుంబం నుంచి బయటకు వచ్చినట్టు హ్యారీ-మెఘన్ మార్కెల్ జంట చెప్పింది.