అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య
రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణపై సమీక్ష
మెదక్, మే6: మానవ తప్పిదాలతో 91 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ సందీప్ శాండిల్య అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలు, రెండు జిల్లాల పరిధిలోని 14 పోలీస్స్టేషన్ల అధికారులతో రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో జాతీయ రహదారి 44, 765 డితో పాటు రాష్ట్ర, జిల్లా రహదారులు 246 కిలోమీటర్ల పొడువు ఉన్నాయన్నారు.
తూప్రాన్, చేగుంట, మనోహరాబాద్, రామాయంపేట, కౌడిపల్లి, కొల్చారం, పుల్కల్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరువు, సదాశివపేట, సంగారెడ్డి రూరల్, గుమ్మడిదల, జోగిపేట, హత్నూర వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన పోలీస్స్టేషన్లను గుర్తించి కారణాలు, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, చెట్ల పొదల తొలగింపు, రేడియం బ్లింకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు రోడ్డుకు దూరంగా చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్, మెదక్, సంగారెడ్డి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.