ఖైరతాబాద్, ఆగస్టు 2: ఎంపీ నామా నాగేశ్వరావు కుమారుడు నామా పృథ్వీతేజపై అగంతకులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బలవంతంగా కారులో ప్రవేశించి డబ్బులు దోచుకున్నారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటనపై పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి, డీఐ నరసింహరాజులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకిలోని తన స్నేహితుడి కోసం కారులో వచ్చిన పృథ్వీతేజను ఫ్లైఓవర్ వద్ద ఇద్దరు దుండగులు అడ్డగించారు. స్కూటీని కారుకు అడ్డంగా పెట్టి కారులోకి ప్రవేశించారు.
ముందు సీటులో ఒకరు వెనుక సీటులో ఇంకొరు కూర్చొని మెడపై కత్తిపెట్టి బెదిరించారు. కారును అక్కడి నుంచి గచ్చిబౌలీకి పోనీయగా, అక్కడ మరో ముగ్గురు ఎక్కారు. మొత్తం ఐదుగురు దుండగులు పృథ్వీతేజ పట్ల కిరాతకంగా వ్యహరించారు. ఓ వైన్ షాపు వద్ద కారు ఆపించి మద్యం కొనుగోలు చేసి అందులోనే సేవిస్తూ అతనిపై పిడిగుద్దులు కురిపించారు. మరికొద్ది దూరం వెళ్లాక, ఆ దుండగుల్లో ఒకడు బలవంతంగా రూ.75వేలు తన అకౌంట్లోకి ఫోన్ పే ద్వారా పంపించుకున్నాడు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, ఎస్ఆర్నగర్ ఇలా నగరంలో పలు చోట్ల తిపారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బాధితుడు ఒక్కసారిగా కారు తలుపులు తెరచుకొని బయటకు దూకి వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ దుండగులు కారు దిగి పారిపోయారు.
సీసీఫుటేజీ, సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా నిందితుల గుర్తింపు
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు టోలిచౌకి నుంచి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వరకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఫోన పే ద్వారా డబ్బును తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఒక నిందితుడి ఆచూకీని సెల్ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా తెలుసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన ఐదుగురిలో టోలిచౌకీకి చెందిన రాపిడో రైడర్ జోయెబ్ (26), మొబైల్ ఫోన్ టెక్నీషియన్ సల్మాన్ (24)లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.