చండీగఢ్ : హర్యానా గురుగ్రామ్లోని ఢిల్లీ – జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బిలాస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఢిల్లీ-జైపూర్ హైవేపై రాత్రి ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ఇన్నోవాపై బోల్తాపడినట్లు సమాచారం.
కారులో చిక్కుకున్న వారంతా తీవ్ర గాయాలతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని రక్షించారు. అప్పటికే నలుగురు కారులోనే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతులు, క్షతగాత్రులు నోయిడాకు చెందిన ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులుగా తెలిసింది. సోమవారం విహారయాత్ర కోసం రాజస్థాన్లోని ఉదయ్పూర్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. పోర్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.