ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని గోశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయిన బైక్ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఇటిక్యాల ఎస్ఐ గోకారి తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
మృతులను ఐజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిగా, ఐజ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన చంద్రకళగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో మహిళను తనగల గ్రామానికి చెందిన మంజులగా గుర్తించారు. గద్వాలలోని శుభకర హాస్పిటల్లో చంద్రకళ ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం నంబర్ – AP 21 AB 2579.