బంజారాహిల్స్, డిసెంబర్ 7 : మద్యం మత్తులో కారు నడిపించి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, మంగళవారం రిమాండ్కు తరలించారు. ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని రెయిన్బో ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతున్న ఆయోద్యరాయ్, దేవేందర్ కుమార్దాస్ను కారు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన ఉప్పల్లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన బజార్ రోహిత్గౌడ్, కర్మన్ఘాట్కు చెందిన సాయి సోమన్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం నిందితులకు 14రోజుల పాటు రిమాండ్కు ఆదేశించింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉన్నందున నిందితులను మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్నేహితులతో కలిసి మాదాపూర్లోని పబ్లో జరిగిన పార్టీలో పాల్గొన్న రోహిత్ గౌడ్, సాయిసోమన్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని పబ్స్లో అర్ధరాత్రి 12.45 దాకా మద్యం సేవించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాత్రి 1.15 ప్రాంతంలో బంజారాహిల్స్లో యాక్సిడెంట్ చేసిన నిందితులు అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా రోడ్ నం.5కి వెళ్లినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోగానే కారును సెల్లార్లో పార్క్చేసి మరో కారులో ఉడాయించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది స్నేహితులకు ఫోన్లు చేయగా ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో నివాసముంటున్న ఓ స్నేహితుడు తన ఇంటి సెల్లార్లో కారు పెట్టాలని సూచించినట్లు సమాచారం. అతడి సూచనల మేరకు వెళ్లిన రోహిత్ గౌడ్, సాయిసోమన్ సెల్లార్లో కారు పార్క్ చేయడం, బీఎండబ్ల్యూ కారులో పారిపోయేందుకు ప్రయత్నించడం చకచకా జరిగిపోయాయి. ఈలోగానే జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని అనుసరించారు. దీంతో పారిపోవాలనుకున్న రోహిత్గౌడ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రమాదం గురించి పెట్రోలింగ్ పోలీసులు వాకబు చేసిన సమయంలో రోహిత్గౌడ్ కారు నడిపింది తాను కాదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే డ్రైవర్ పేరు.. ఇతర వివరాలు చెప్పాలంటూ పెట్రోలింగ్ పోలీసులు గట్టిగా పట్టుబట్టారు. కంగారుపడిపోయిన రోహిత్గౌడ్ అసలు నిజాన్ని చెప్పేశాడు. ఈ విషయం గురించి బంజారాహిల్స్ పోలీసులకు చెప్పడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.