చెన్నై : తమిళనాడు 26వ గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ పని చేసిన భన్వరీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ అవగా.. ఆయన నాగాలాండ్ నుంచి తమిళనాడుకు వచ్చారు. శనివారం రాజ్భవన్లో గవర్నర్తో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేత కే పళనిస్వామి, తదితరులు పాల్గొన్నారు.
బీహార్లోని పాట్నాలో జన్మించిన రవి, 1974 లో ఫిజిక్స్లో మాస్టర్స్ చేశారు. జర్నలిజంలో కొంతకాలం పనిచేసిన తర్వాత 1976లో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. అతను కేరళలో ఒక దశాబ్దం పాటు వివిధ హోదాల్లో పని చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లోనూ సేవలందించారు. ఐబీలో ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో పని చేశారు.
2012లో ఐపీఎస్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత పలు జాతీయ దినపత్రికలకు కాలమ్స్ రాశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్గా, 2018 అక్టోబర్లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియామకమయ్యారు. ఆగస్ట్ 1, 2019 నుంచి ఈ నెల 15 వరకు నాగాలాండ్ గవర్నర్గా సేవలందించారు. ఆయన 2014లో నాగ శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు.