న్యూఢిల్లీ, అక్టోబర్ 24: నియంత్రణ లేని పెట్రోల్ ధరల కారణంగా సామాన్యుడు కనీసం పండుగల వేళ కూడా ఇంట్లో సంతోషంగా గడపలేని పరిస్థితి నెలకొన్నది. పండుగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనడానికి, ఇంట్లో పిండి వంటలు చేయడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ప్రజల ఆలోచన తీరు ఇలాగే ఉంది. లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పెట్రో రేట్ల పెరుగుదల వల్ల ప్రజలు అవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి వస్తున్నదని సర్వే తెలిపింది. దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో షాపింగ్ చేయాలనుకొనే వారి సంఖ్య పెరిగింది. మే నెలలో 30% మంది మాత్రమే షాపింగ్కు మొగ్గు చూపగా సెప్టెంబర్ నాటికి 60 శాతానికి పెరిగింది. ఇంకా 40% మంది పండుగ షాపింగ్ చేయడానికి వెనుకాడటం ధరల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, పుణె, గురుగ్రామ్, నోయిడాలోని 61వేల గృహాలపై ఈ సర్వే నిర్వహించారు.
సర్వే నిర్వహించిన 61వేల గృహాల్లో మెజారిటీ ప్రజలు పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల రేట్లపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతీ ఇద్దరిలో ఒకరు ఆన్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతున్నారు. లేదా పెద్ద పెద్ద మాల్స్కు వెళ్లడానికి బదులుగా స్థానికంగానే కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మళ్లీ 35 పైసల చొప్పున వరుసగా ఐదోరోజు పెంపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పెట్రోల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున చమురు కంపెనీలు రేట్లు పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.112.26, లీటర్ డీజిల్ రేటు 105.43కు పెరిగింది. సెప్టెంబర్ 28 నుంచి 21 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేట్లు 24 సార్లు పెరిగాయి. అప్పటి నుంచి ప్రస్తుతానికి పెట్రోల్ రేటు రూ.6.4, డీజిల్ రేటు రూ.7.70 పెరిగింది. అంతకుముందు మే 4-జూలై 17 మధ్యలో పెట్రోల్ రేటు 11.44 రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు రూ.9.14 పెరిగింది.