తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతిలో గత 10 రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. భక్తులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తులను కట్టడి చేయడంలో అధికారులు పెద్ద పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
యాత్రీకులు ఎక్కువగా వచ్చే తిరుపతిలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. గత వారం, పది రోజులుగా ఈ సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతున్నది. కొవిడ్ కేసులు పెరుగుతున్నా అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు, నివారణ చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదు. భద్రతా ప్రోటోకాల్లపై మార్గదర్శకాలు కూడా ఇంతవరకు జారీ చేయకపోవడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 90 శాతం మంది ప్రజలు మాస్క్లను ఉపయోగించడం లేదని, శానిటైజర్లను విస్మరిస్తున్నారు. నగరంలో జరుగుతున్న వివిధ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న నాయకులు, పార్టీల శ్రేణులు మాస్క్లు ధరించడంలేదు. అదేవిధంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం వంటి బహిరంగ ప్రదేశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం 13 కేసులు నమోదయ్యాయి. బుధవారం 19, గురువారం 21 కేసులు వచ్చాయి. ప్రజలను హెచ్చరించడంలో అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారు. రోజువారీ నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్య, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న కొవిడ్ బెడ్లపై సమాచారం అందుబాటులో లేదు. అయితే, రుయా ఆసుపత్రి అధికారులు మాత్రం 40 ఆక్సిజన్, 80 నాన్-ఆక్సిజన్ పడకలతో పాటు 120 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును అందుబాటులో ఉంచారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల స్వాబ్ సేకరణ కేంద్రాన్ని ఓపీ బ్లాక్ సమీపంలో నెలకొల్పారు.