బంజారాహిల్స్, అక్టోబర్ 3: నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కారణాలు గుర్తించి సరైన పరిష్కార మార్గాలు కనుక్కోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. నగరంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ‘రోప్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్తో పాటు సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అనే అంశాన్ని పరిశీలించేందుకు నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో నగరంలో చాలా మంది వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేయడంతో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ కూడా పెరిగిందని, ట్రాఫిక్ను సరైన రీతిలో నియంత్రించలేకపోతే బెంగళూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు హైదరాబాద్ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
నగర రహదారులపై 75 లక్షల వాహనాలు..
నగరంలోని రహదారులపై సుమారు 75 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని సీపీ చెప్పారు. పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ సమస్య లేకుండా.. సాఫీగా వెళ్లేలా చూడటం ప్రథమ ప్రాధాన్యతగా మారిందని వివరించారు. పలు కూడళ్ల వద్ద వాహనదారులు ట్రాఫిక్లో చాలా సేపు నిలిచిపోవాల్సి వస్తున్నదని, దీన్ని అధిగమించేందుకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే, ఫ్రీ లెఫ్ట్ ఉన్నచోట వాహనాలు అడ్డుగా పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నదని తెలిపారు. దీనిని నివారించేందుకే ఆపరేషన్ రోప్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంచేందుకే జరిమానాలు విధిస్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ట్రాఫిక్ డీసీపీ రంగారావు, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలిరోజున నగర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 472 మంది వాహనదారులపై, 18 షాపుల నిర్వాహకులపై జరిమానాలు విధించారు.