గుడికి వెళ్లగానే భక్తులు గంట కొడతారు ఎందుకు ? – డా॥ ఇ. కృష్ణమూర్తి, గంభీరావుపేట
ఆగమార్థంతు దేవానామ్, గమనార్థంతు రక్షసామ్
కురు ఘంటా రవం తత్ర, దేవతాహ్వాన లాంఛనం॥
‘దేవతలు వచ్చేందుకు, రాక్షసులు సెలవు తీసుకునేందుకు ఘంటారావం చేస్తున్నాం. దేవతలను ఆహ్వానించే లాంఛనం ఇది’ అని పైశ్లోకానికి అర్థం. దైవారాధన ప్రారంభించే సమయంలో ఈ శ్లోకం పఠిస్తూ గంటానాదం చేస్తారు. కంటికి కనిపించని కొన్ని దుష్టశక్తులు మన చుట్టూ పరిభ్రమిస్తుంటాయని పెద్దలు చెబుతారు. గంటానాదంతో అవి దూరమవుతాయని విశ్వసిస్తారు. మనం ధ్యానించే దైవానికి ఆహ్వానం పలుకుతూ పంచలోహాలతో, కంచుతో చేసిన గంటను మోగించడం శుభసూచకం అని ధర్మశాస్త్రం చెబుతున్నది. దేవాలయంలోని దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, మన మనసులోని సంకల్పాన్ని భగవంతుడికి భక్తితో నివేదించడానికి గంటానాదం తోడ్పతుంది.
గంటలోని నాలుకభాగంలో సరస్వతీదేవి, ముఖభాగంలో బ్రహ్మ, ఉదరభాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి దగ్గర గరుడ, చక్ర, హనుమ, నంది కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే గర్భగుడి ముఖద్వారం ముందు ఉండే గంటను సకల దేవతా స్వరూపంగా భావిస్తారు. కంచుగంటను మోగించినప్పుడు వినిపించే శబ్దం ఓంకార నాదమై పరిసరాల్లో మార్మోగుతుంది. భగవంతుడి దర్శనానికి వచ్చిన భక్తుడి మనసును నిశ్చలం చేయడానికి దోహదం చేస్తుంది. గంటానాదం విన్నప్పుడు మనలో లౌకిక ఆలోచనలు తొలగిపోయి, మనసు ఏకాగ్రతతో దైవం వైపు మళ్లుతుందని విశ్వసిస్తారు. అందుకే, గుడికి వెళ్లగానే గంట కొట్టే సంప్రదాయం ఏర్పడింది.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370