హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు అంగీకరించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మిల్లర్లతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం దించుకోవడం, బాయిల్డ్ రైస్కు బదులు రా రైస్ ఇవ్వ డం వల్ల కలిగే నష్టంపై, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పరిహారంపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని, దీనిని సాకుగా చూపి రైతులను ఇబ్బంది పెట్టొద్ద ని చెప్పారు. ముందుగా ధాన్యం దించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ ధాన్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందని పేర్కొన్నారు.
మిల్లర్ల అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వం ధాన్యం కొ నుగోలు చేసినా.. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. మంత్రి ప్రతిపాదనను అంగీకరించిన మిల్లర్లు ధాన్యం దించుకునేందుకు ముందుకొచ్చారు. ఇక యాసంగిలో బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ ఇవ్వడం వల్ల కలిగే నష్టంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై సీఎస్ శుక్రవారం సమీక్ష చేసినట్టు తెలిపారు. ప్రాంతాలవారీగా మిల్లర్లందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే.. అందరికీ ఆమోదయోగ్యంగా పరిహారం ఇస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని, సీఎమ్మార్లో లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం లేకుండా చూడాలని మిల్లర్లు కోరారు.
అవకతవకలు అవాస్తవం
మిల్లుల్లో ధాన్యం గోల్మాల్ జరిగిందంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మిల్లర్లను దొంగలుగా చూడటం బాధిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం, బియ్యం గోల్మాల్ జరిగిందనేది పూర్తిగా అవాస్తమని, దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒకరిద్దరు చేసిన తప్పుకు మొత్తం వ్యవస్థనే తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే విచారణ చేయించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని గుర్తుచేశారు. మిల్లర్ల ఆత్మైస్థెర్యం దెబ్బతినేలా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఎప్పుడూ తమ మేలు గురించి మాట్లాడని కిషన్రెడ్డి.. ఇప్పుడు మాత్రం ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.