ఆదిలాబాద్ : బీ(టీ)ఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బోథ్ మండలం ధన్నూరు గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఅర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ 14 సంవత్సరాల పాటు అలుపెరగకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అనేక అభివృద్ధి , సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది కోరుకోవడంతో జాతీయ పార్టీని ప్రకటించా రని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజీపీ కేంద్ర మంత్రులు ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యా రాణి, ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, బోథ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.