హైదరాబాద్: ట్యాంక్బండ్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైకోర్టు తీర్పుపై పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రేపు ప్రభుత్వం తరఫున హౌజ్ మోషన్ పిటిషన్ వేస్తామని తెలిపారు. హుస్సేన్ సాగర్లో యథావిధిగా నిమజ్జనం చేసేలా హైకోర్టు అవకాశం ఇవ్వాలని కోరారు. ట్యాంక్బండ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వచ్చిందని, అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని తెలిపారు.
హైదరాబాద్లో కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్నదని, హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్లో ముందస్తు ఆదేశాలిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. హైకోర్టు పెద్దమనసు చేసుకుని తీర్పునివ్వాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. నిమజ్జనం అయిన 48 గంటల్లో వ్యర్థాలు తీసివేస్తామని పేర్కొన్నారు.
ట్యాంక్బండ్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని తీర్పునిచ్చింది. మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయడానికి అనుమతించింది.