వికారాబాద్ జిల్లా :
అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ అభివృద్ధికి ఎక్కువ మంది రైతులను నమోదు చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సూచించారు.
గురువారం మోమిన్పేట మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరుపై సంబంధిత అధికారులు, సీసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల రైతులు అన్ని రకాల కూరగాయల పంటలు పండించే విధంగా వారిని ప్రోత్సాహించాలని అధికారులకు సూచించారు.
రైతులకు అవసరమైన నాణ్యమైన నారు ఉచితంగా అందజేసి వారు పండించిన పంటలు కంపెనీకి అమ్ముకునేటట్లు చూడాలన్నారు. చిన్న, సన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులను కూడా కంపెనీలో భాగస్వాములు చేయాలన్నారు. సీసీలు ప్రతిఒక్కరు ఒక్కొక్క రైతును కంపెనీలో సభ్యునిగా చేర్చాలని కోరారు. రైతులకు వారు పండించిన పంటలకు మంచి ధర కల్పిస్తామని, వచ్చిన లాభాలలో యాభై శాంతం రైతులకు ఇస్తామని రైతులకు తెలియపర్చాలన్నారు.
అంతకుముందు మండలంలోని కాసారం గ్రామంలో రోడ్డు, మురికి కాలువలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పాత బావులను పూడ్చి వేయాలని ఆదేశించారు.