న్యూఢిల్లీ, నవంబర్ 25: నీట్ పీజీ వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) క్యాటగిరీ రిజర్వేషన్కు అర్హతగా నిర్ణయించిన రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని, కమిటీ నివేదిక అందేసరికి 4 వారాల సమయం పడుతుందని పేర్కొంది. అందుచేత నీట్-పీజీ కౌన్సెలింగ్ మరో 4 వారాలు వాయిదా పడుతుందని తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నీట్-పీజీ ప్రవేశాల్లో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జూలై 29న కేంద్రం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇచ్చిన నోటిఫికేషన్ను పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. గత విచారణలో రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ఎలా నిర్ణయించారంటూ కేంద్రానికి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆ పరిమితిని సమీక్షించే ఉద్దేశం ఉందా? అని అడిగింది. ఈ నేపథ్యంలో సమీక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకొని కోర్టుకు తెలిపింది.
శాస్త్రీయత అవసరం
ఈడబ్ల్యూస్ కోటా మంచిదేనని, అయితే దానికి అర్హతను శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ అర్వింద్ దతార్ వాదనలు వినిపించగా.. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు.