హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : కరోనా మనిషి బతుకు చిత్రాన్ని మార్చేసింది. జీవన విధానాన్ని తలకిందులు చేసేసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపైనా ప్రభావాన్ని చూపింది. రెండేండ్లపాటు విద్యాసంస్థలు అరకొరగానే నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పాఠశాలలకు వెళ్లకపోవడం, ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం లేకపోవడం తదితర కారణాలతో చిన్నారుల్లో సృజనాత్మకత కొరవడింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినప్పటికీ పాఠాలను పూర్తిస్థాయిలో వారు అర్థం చేసుకోలేక పోయారు. ఆన్లైన్ క్లాసులు అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికి అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్పటివరకు ప్రత్యక్ష తరగతులకు అలవాటు పడిన విద్యార్థులకు ఆన్లైన్ బోధన ఒంటబట్టలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై కొవిడ్ ప్రభావం, చదువులో మార్పులు, సృజనాత్మకతలపై స్మైల్ ఇండియా ఫౌండేషన్ చేసిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 22 రాష్ర్టాల్లో 48 వేల మంది పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
కరోనా సంక్షోభం తర్వాత విద్యార్థుల జీవనశైలిలో కీలక మార్పులను గుర్తించినట్టు సర్వే వెల్లడించింది. తమకు క్లాస్రూం పాఠాలు అర్థం కావడం లేదని సగానికిపైగా పిల్లలు చెబుతున్నారు. కరోనా అనంతరం సగానికి పైగా చిన్నారులు తమ వయసుకు తగిన చదువు చదవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే కొవిడ్ తర్వాత తల్లిదండ్రులు పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. 38 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల తీరుపై ఉపాధ్యాయులతో చర్చిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాల్లో 27 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. అయినప్పటికీ విద్యార్థుల చురుకుదనం పెరగడం లేదు. తరగతిగదిలో తరచూ పరధ్యానంలోకి జారుకుంటున్నారని, వారి ఆలోచనాశక్తి తగ్గిపోయిందని స్మైల్ఇండియా ఫౌండేషన్ ఆందోళన వ్యక్తంచేసింది.