సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు
న్యూఢిల్లీ, మే 20: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏండ్లు రాగానే పదవీవిరమణ చేయాల్సి వస్తున్నదని, రిటైర్మెంట్కు ఇది తక్కువ వయసని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు అన్నారు. సుప్రీంలో కనీసం 7-8 ఏండ్లపాటు జడ్జిలు విధులు నిర్వర్తించేలా సవరణలు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.
జూన్ 7న జస్టిస్ నాగేశ్వరరావు రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగేశ్వరరావు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు సాధువులేమీ కాదని, వారిమీదా పని ఒత్తిడి ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. తాను న్యాయవాదులతో ఏదైనా సందర్భంలో కోపంగా మాట్లాడి ఉంటే అందుకు క్షమాపణలు తెలియజేసుకొంటున్నానని చెప్పారు.
బెంచ్కు తీరనిలోటు: సీజేఐ
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. జస్టిస్ నాగేశ్వరరావు పదవీవిరమణ బెంచ్కు తీరనిలోటు అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం అధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. జస్టిస్ నాగేశ్వరరావుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తామిద్దరం ఏపీలో న్యాయవాద వృత్తి ప్రారంభించామని చెప్పారు.