శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు శుక్రవారం పునః ప్రారంభించినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రటకనలో తెలిపారు. 19 నెలల విరామం అనంతరం ఉదయం 9.55 కు 120 మంది ప్రయాణీకులతో విమానం బయలుదేరింది. వారానికి రెండుసార్లు సోమ, శుక్రవారం ఈ విమానాలు నడుస్తాయి.
ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ అత్యంత ప్రధాన పర్యాటక ప్రాంతం కొలంబోకు నేరుగా హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు చాలా రోజుల తర్వాత పునః ప్రారంభించడం ఎంతో సంతృప్తికరంగా ఉందని తెలిపారు.త్వరలో మరిన్ని నూతన గమ్య స్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
శ్రీ లంక ఎయిర్లైన్స్ రీజనల్ మేనేజర్ రవీంద్రన్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మార్కెటింగ్ దృష్ట్యా ప్రయాణీకుల డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక ఎయిర్లైన్స్ ఫ్రీక్వెన్సీ, కెపాసిటి పెంచాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్టు అధికారులు, కొలంబో అధికారులు పాల్గొన్నారు.