కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్-19 ఆంక్షలను ఈ నెల 30వ వరకు పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు గురువారంతో ముగినుండగా.. మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు మూసే ఉండనున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల పని వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిమితం చేసింది. ఇంట్రా స్టేట్ ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, టాక్సీలు, క్యాబ్లు 50శాతం సీటింగ్ కెపాసిటీతో నడిచేందుకు అనుమతి ఇచ్చింది. వాహనాలను క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయడంతో పాటు మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. అత్యవసర, అవసరమైన సేవల సిబ్బంది కోసం ప్రత్యేక రైళ్లు మినహా లోకల్ రైళ్లు మూసివేసింది.
50శాతం సీటింగ్ సామర్థ్యంతో మెట్రో రైళ్లు వారానికి ఐదు రోజులు మాత్రమే నడువనున్నాయి. అయితే, శని, ఆదివారాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. సామాజిక, సాంస్కృతిక, విద్యా, వినోద సంబంధిత కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. వివాహాల్లో 50 మందికి మించకుండా, 20 మందితో అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా హాళ్లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసే ఉంటాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుల కోసం మాత్రం ప్రత్యేకంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. అన్ని దుకాణాలు, మార్కెట్లో గతంలో ఇచ్చిన ఆదేశాలు మేరకు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.