న్యూఢిల్లీ : దేశీయ విమానాయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానాల్లో ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీపై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 18 నుంచి ఆంక్షల ఎత్తివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇకపై విమానాలను వందశాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని పేర్కొంది.
వచ్చే సోమవారం నుంచి వందశాతం సామర్థ్యం విమానయాన సంస్థలు సర్వీసులను నడుపుకోవచ్చని పేర్కొన్న మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో దేశీయ విమానాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది.
గతేడాది డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ ఒకటిన ఆక్యుపెన్సీని 50శాతానికి తగ్గించింది. ఆగస్ట్ 12 నాటికి 72.5శాతానికి సీటింగ్ కెపాసిటీని పెంచింది.. సెప్టెంబర్లో 85శాతానికి పెంచగా.. తాజాగా పూర్తిస్థాయిలో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొవిడ్ వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేట్లను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.