హైదరాబాద్ : కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పెద్ద సంఖ్యలో రైళ్లు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి దిగి వస్తుండడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను పట్టాలెక్కిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు భారతీయ రైల్వే పేర్కొంది. పలు రూట్లలో తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 02603 చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ట్రైన్ను గురువారం నుంచి, 02604 హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ట్రైన్ను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. కాచిగూడ – రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్, తుంగభద్ర ఎక్స్ప్రెస్, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్ప్రెస్ను సైతం బుధవారం దక్షిణ మధ్య రైల్వే పట్టాలెక్కించింది.