ముంబై : కుటుంబ సభ్యులతో కలిసి అలా బయటకు వెళ్లి ఏ రెస్టారెంట్లోనో ఇష్టమైన వంటకాలను ఆరగిద్దామని వెళితే ఇక జేబులు గుల్లవడం ఖాయం. పెరుగుతున్న ముడిపదార్ధాల ధరలు, గ్యాస్ ధరలతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపేందుకు రెస్టారెంట్ల యజమానులు సిద్ధమవుతున్నారు. కూరగాయల నుంచి ఇంధన ధరల వరకూ ధరలు మండిపోతుండటంతో ఆహార పదార్ధాలను వండివార్చడం రెస్టారెంట్ల నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారడంతో మెనూ టారిఫ్లపై వారు దృష్టిసారిస్తున్నారు. ముడిచమురు ధరలు బ్యారెల్కు ఏకంగా 117 డాలర్లకు చేరడంతో వచ్చే వారం నుంచి ఇంధన పెంపు తప్పదని రెస్టారెంట్ ఓనర్లు చెబుతున్నారు.
ఇంధన ధరలు పెరిగితే సరుకు రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, పప్పులు, నూనెలు సహా అన్ని వస్తువుల ధరలు ఎగబాకుతాయని దీంతో తాము తప్పక కస్టమర్లపై కొంత భారాన్ని మోపాల్సిన పరిస్ధితి ఎదురవుతుందని స్పెషాలిటీ రెస్టారెంట్స్ సీఎండీ అంజన్ ఛటర్జీ బాంబు పేల్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో వంటనూనెల ధరలూ మండిపోతున్నాయి. మరోవైపు వాణిజ్య సిలిండర్ల ధరలు ఆయా నగరాల్లో రూ 1900 నుంచి రూ 2000 వరకూ పెరిగాయి.
పరిస్ధితి ఇలాగే ఉంటే తాము ధరలు పెంచకతప్పదని, ఇది సామాన్యుడిపై భారం మోపుతుందని భారత హోటల్స్, రెస్టారెంట్స్ సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి ప్రదీప్ శెట్టి పేర్కొన్నారు. థర్డ్ వేవ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని తక్కువ వడ్డీరేటుతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని రెస్టారెంట్ యజమానులు కోరుతున్నారు.