కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించగా ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవల కోటపల్లి మండలం షట్పల్లి గ్రామానికి చెందిన ఆసరా పింఛన్దారులు తమకు ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బుల నుంచి ప్రతి నెలా రూ.6 హరిత నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించగా అదే మార్గంలో మండలంలోని సిర్స గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆసరా పింఛన్దారులు మేము సైతం అంటూ చేయి కలిపారు.
ఆదివారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పెద్దింటి పున్నంచంద్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో హరితనిధి కార్యక్రమానికి తమవంతుగా సహాయం అందించాలని గ్రామ పాలకవర్గం సూచించగా, ఇందుకు ఆసరా పింఛన్దారులు తమ మద్దతు ప్రకటించారు. హరిత యజ్ఞంలో తమ వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పింఛన్దారులు పేర్కొన్నారు. గ్రామంలో మొత్తం 186 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రతి నెలా హరితనిధికి రూ. 1116 జమ కానున్నాయి.