హైదరాబాద్ : ప్రార్థించే పెదాల కన్న సాయం చేసే చేతులు మిన్న అంటారు.. అలాంటి చేతుల కోసం చేతులెత్తి ప్రాధేయపడుతోంది ఓ కుటుంబం. బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చేరిన ఓ నిరుపేద గీత కార్మికుడికి వైద్యమందించలేని పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని వేడుకుంటోంది. గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన నామాపురం శోభ-బాలాగౌడ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వప్న, రేణుక, కుమారుడు విగ్నేశ్ ఉన్నారు. బాలాగౌడ్ 27 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చెందాడు.
దీంతో శోభ కుటుంబాన్ని పోషించింది. 2002లో పెద్ద కూతురు పెండ్లి చేసింది. శోభ కూడా అనారోగ్యానికి గురై 2004లో మృతి చెందగా, ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రెండో కూతురైన రేణుకను బంధువుల సహకారంతో 2008లో బొప్పాపూర్కు చెందిన అతికం శ్రీనివాస్కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు నేత్ర ఉన్నది. స్థానికంగా సరైన ఉపాధి లేక భార్యా, పిల్లలను పోషించుకునేందుకు అప్పు చేసి గల్ఫ్బాట పట్టాడు. అక్కడా శ్రీనివాస్ను విధి వెంటాడగా.. సరైన ఉపాధి లేక తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఓ కల్లు దుకాణంలో పని చేస్తూ బతుకీడుస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట శ్రీనివాస్కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. చికిత్స కోసం రూ.15లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో భార్య రేణుక కొట్టుమిట్టాడుతున్నది. భర్తకు చికిత్స అందించేందుకు ఏం చేయాలో.. ఎవరిని అడగాలో.. తన గోడును ఎవరికి చెప్పుకోలేక రేణుక నరకయాతన అనుభవిస్తున్నది.
బాధితుడి దీనపరిస్థితిని చూసిన గ్రామస్తులు సదరు కుటుంబానికి సాయం అందించాలని సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుతున్నారు. సాయం అందించాలనుకునే వారు గూగుల్ పే నంబర్ ఎన్.విగ్నేశ్ 9652645907కు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, గంభీరావుపేట, అకౌంట్ నంబర్62424285450 ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020295కు పంపించి నిరుపేద కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయం అందించి అండగా నిలువాలని కోరారు.