కుత్బుల్లాపూర్, అక్టోబర్13: వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతితో పరుగులు తీస్తున్న తెలంగాణ అత్యాధునిక వ్యవసాయ పరిశోధనలకు నెలవుగా మారబోతున్నది. ఇందులో భాగంగా విత్తనాలతో పనిలేకుండా కణజాలంతోనే మొక్కలను సృష్టించే టిష్యూకల్చర్ ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొంటున్నది. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్లలో రాష్ట్ర విత్తనాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రూ.4 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రయోగశాలకు వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల, కమిషనర్ హనుమంత్ కే జెండగే, విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే కేశవులు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో ఏర్పాటవుతున్న తొలి టిష్యూకల్చర్ ప్రయోగశాల ఇదేనని తెలిపారు. ఈ ప్రయోగశాల ద్వారా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చే అవకాశమున్నదని పేర్కొన్నారు. నాణ్యమైన పండ్లు, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలను తయారుచేసి రాష్ట్ర రైతులకు, హరితహరం లాంటి కార్యక్రమాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రయోగశాల దోహదపడుతుందని చెప్పారు.