హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని 29 మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి నివేదికలు సిద్దం చేయాలని అన్నిశాఖల అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
సమగ్ర వివరాల సేకరణ అనంతరం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమై తుది ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధిపై సంబంధిత విభాగాల అధికారులతో బీఆర్కేఆర్ భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
మౌలిక సదుపాయాలు, తాగునీరు, మురుగు, రోడ్లు, డంపింగ్ యార్డులు, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు తదితర సౌకర్యాలపై దృష్టిపెట్టాలని అధికారులు సూచించారు.
నాలాలు, చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి , వైకుంఠధామాల నిర్మాణం, బస్తీ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ప్రభుత్వ భూములు, భవనాలను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.
నానాటికి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కార్యాచరణ తయారుచేయాలని సైబారాబాద్ , రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిశోర్, సీడీఎంఏ సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డీ అమోయ్ కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ టెలికాన్ఫరన్స్లో పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి