ముంబై, సెప్టెంబర్ 30: పండుగ సీజన్లో ప్రజలకు చేదువార్త. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో దసరా, దీపావళి పండుగల వేళ గృహ, వాహన, ఇతర రుణాల ప్రతినెలా వాయిదాలు పెరగను న్నాయి. గత ఐదు నెలల్లో వడ్డీ రేట్లను పెంచటం ఇది నాలుగోసారి. మూడు రోజుల ద్రవ్య విధాన సమీక్ష ముగింపు రోజైన శుక్రవారం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచాలని నిర్ణయించామని తెలిపారు. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరనున్నది.
2019 ఏప్రిల్ తర్వాత ఇదే గరిష్ఠం. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు రెపోరేటు 1.90 శాతం పెరిగింది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఆరుగురు సభ్యులుగల (గవర్నర్తో సహా ముగ్గురు ఆర్బీఐ ప్రతినిధులు, మరో ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణులు) ఎంపీసీలో ఐదుగురు రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారని దాస్ తెలిపారు. ఒకవైపు వృద్ధికి సహకరిస్తూనే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సరళ ద్రవ్య విధానాన్ని ఉపసంహరించడంపైనే దృష్టి నిలపాలని ఎంపీసీ సభ్యులు నిర్ణయించారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వివరించారు.
ప్రస్తుత తమ పాలసీ రేటు పెరిగిన మరో భారీ వడ్డింపు ద్రవ్యోల్బణంతో పోలిస్తే 2019 స్థాయికంటే తక్కువేనని ఆర్బీఐ గవర్నర్ సమర్థించుకున్నారు. ‘ రెపో రేటు పెంపుతో వ్యక్తిగత రుణ గ్రహీతలు, కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరుగుతాయి. అంతర్జాతీయ మాంద్య భయాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటాం’ అని దాస్ చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్షోభంతో ద్రవ్యోల్బణం దిశ అనిశ్చితంగా ఉందని, అధిక ద్రవ్యోల్బణం కొనసాగితే తీవ్ర ప్రభావాలు ఉంటాయని దాస్ హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ద్రవ్యోల్బణం అంచనాల్ని 6.7 శాతం వద్దేనే కొనసాగించింది.
రేట్లు మరింత పెరుగుతాయ్
వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ మరింత పెంచేఅవకాశం ఉన్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని, దీంతో మరింత వడ్డీ రేటు పెంపు తప్పదని ఇండియా రేటింగ్స్ ఎకనమిస్ట్ సునీల్ కుమార్ సిన్హా చెప్పారు. ఈ ప్రభావంతో కార్పొరేట్ల మూలధన ప్రణాళికలు నెమ్మదిస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకింగ్ హెడ్ అనుఅగర్వాల్ చెప్పారు.