టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం
వర్సిటీల్లోనే ఇంటర్వ్యూలు
సాధాసాధ్యాలపై నేడు నిర్ణయం
1,061 పోస్టుల భర్తీకి అనుమతి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీ గా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ బాధ్యతను టీఎస్పీఎస్సీకి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు ఏ వర్సిటీలో ఖాళీలను ఆ వర్సిటీయే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తూ వస్తున్నాయి. ఇలాకాకుండా అన్ని వర్సిటీల్లో ఖాళీలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నది. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను టీఎస్పీఎస్సీకి, ఇంటర్వ్యూల నిర్వహణ బాధ్యతలను ఆయా వర్సిటీలకు అప్పగించే అవకాశం ఉన్నది. ఈ విధానం సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉన్నత విద్యామండలి, అన్ని వర్సిటీల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఈ పోస్టుల భర్తీపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
జాప్యానికి తావులేకుండా..
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో 1,061 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్ర భుత్వం అనుమతిచ్చింది. వీటి భర్తీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు, జాప్యానికి తావులేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడం హర్షణీయం. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీతో వర్సిటీలన్నీ బలోపేతమవుతాయి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం మం చిదే. న్యాయపరమైన చిక్కులకు తావులేకుండా, సమస్యలు తలెత్తకుండా ని యమకాలు పకడ్బందీగా చేపట్టాలి.