వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఒకరిపై ఒకరు మనసు పెంచుకున్నారు. ఇద్దరి మనసులు కలియడంతో.. ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మతాలు వేరు.. అబ్బాయి హిందూ.. అమ్మాయి ముస్లిం. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరిస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మంచి మనసు ఉండాలే కానీ.. మతమెందుకు అంటూ వారి ప్రేమకు స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం సంప్రదాయం ప్రకారం వారి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించిన తల్లిదండ్రులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మహారాష్ర్టలోని కొల్హాపూర్కు చెందిన సత్యజిత్ సంజయ్ యాదవ్, మార్ష నదీం ముజావర్.. స్కూల్ ఏజ్ నుంచి మంచి దోస్తులు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ బీటెక్ పూర్తి చేశారు. సత్యజిత్ సివిల్ ఇంజినీర్ కాగా, మార్ష నదీం ఆర్కిటెక్చర్. వీరిద్దరూ సెటిలవ్వడంతో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇరు కుటుంబాలకు తమ ప్రేమ గురించి తెలియజేశారు. వీరి ప్రేమను పెద్దలు తిరస్కరించలేదు. ఎందుకంటే ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నత విద్యావంతులు.. అందుకే గొప్పగా ఆలోచించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఇటీవలే కొల్హాపూర్లోని ఓ హోటల్లో హిందూ, ముస్లిం ఆచార సంప్రదాయాల ప్రకారం.. సత్యజిత్, మార్ష నదీం వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. ఎంతో గొప్పగా జరిగిన ఈ వివాహం గురించి కొల్హాపూర్లో చర్చ జరిగింది. సత్యజిత్, మార్ష తల్లిదండ్రుల మనసు ఎంత గొప్పదో అని కొనియాడారు.