తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని (Mukesh Ambani) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న అంబానీ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖేశ్ అంబానీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.