Reliance | ముంబైలోని సర్ హెచ్ఎం రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ను పేల్చేస్తామని ఆ దవాఖానకు బుధవారం బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్లో ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు దిగారని సమాచారం.
బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు తమకు రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ముంబై పోలీసులు చెప్పారు. డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ బెదిరింపు ఫోన్ కాల్పై కేసు నమోదు చేశామని, తదుపరి కేసు దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కాల్ చేసిన వ్యక్తి లొకేషన్ను ట్రేస్ చేస్తామని పేర్కొన్నారు.
గత ఆగస్టు నెలలోనూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు వచ్చిన బెదిరింపు కాల్స్ను దవాఖాన సిబ్బంది అందుకున్నారు. ఆగస్టు 15న రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కు ఎనిమిది కాల్స్ వచ్చాయి. ఈ అంశంపై విష్ణు భౌమిక్ (56) అనే అనుమానితుడ్ని ముంబై సబర్బన్లోని దాహిసార్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.