న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు అందజేస్తున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని మోదీ టీకా తీసుకోగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రైవేటు దవాఖానల్లో రూ.250 చార్జీలు మించకూడదని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కొవిడ్ టీకా ఎలా తీసుకోవాలి..? అనేది చాలా మందిలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎక్కడికి వెళ్లాలి..? ఎలా పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..? రిజిస్ట్రేషన్ సమయంలో ఆధారాలు సమర్పించాలా..? ఏవైనా సమస్యలు వస్తే ఎలా..? అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం టీకాలు తీసుకునే విషయాలను వెల్లడించింది. దవాఖానల్లో వ్యాక్సిన్ పొందేందుకు ఎలాంటి దరఖాస్తులు అందుబాటులో లేవని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కోవిన్.జీఓవీ.ఇన్ (http://cowin.gov.in) వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా పౌరులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్పోర్టల్ ద్వారా టీకాలు అందించే కేంద్రాలలో అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవడం పేర్లను నమోదు చేసుకోవాలి. పౌరులు కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా టీకా కోసం పేర్లను నమోదు చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ సొంత రాష్ట్రంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అతను ఏ రాష్ట్రంలోనైనా టీకాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలను కూడా ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంటుంది. పోర్టల్లో ఒక మొబైల్ నంబర్తో నలుగురు వ్యక్తుల పేర్లను మాత్రమే నమోదు చేసుకోవచ్చు. దీని కోసం, ప్రతి ఒక్కరి ఫొటో ఐడీ నంబర్ భిన్నంగా ఉండాలి.
టీకా స్లాట్ బుకింగ్ చాలా కష్టమైన పని కాదు. పలు సాధారణ దశలతో సులభంగా పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చు.
1 స్టెప్ : కోవిన్ ప్రభుత్వ పోర్టల్ www.cowin.gov.in ను సందర్శించాలి.
2 స్టెప్: ఇప్పుడు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆప్షన్ కనిపిస్తుంది.
3 స్టెప్: ఎంపిక ఆప్షన్పై క్లిక్ చేయాలి. కోవిన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళతారు.
4 స్టెప్: ఇప్పుడు 10 అంకెల మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఓటీపీ పొందడానికి క్లిక్ చేయాలి.
5 స్టెప్: ఓటీపీ సంఖ్యను నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయాలి.
6 స్టెప్: తదుపరి దశలో, టీకా నమోదు పేజీకి మళ్ళించబడతారు. ఇప్పుడు, ఐడీ ప్రూఫ్ వివరాలను నమోదు చేయాలి.
7 స్టెప్: మీకు సంబంధించిన వివరాలను పూరించాలి. గుర్తింపు పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
8 స్టెప్: ఏదైనా కొమొర్బిడ్ కండిషన్ ఉందా? అని పోర్టల్ అడుగుతుంది. ఎన్ లేదా నో ఆప్షన్పై క్లిక్ చేసి సమాధానం ఇవ్వాలి. అవును అయితే, దానికి రుజువును అప్లోడ్ చేయాలి.
9 స్టెప్: ఇప్పుడు అపాయింట్మెంట్ను షెడ్యూల్ చేయమని అడుగుతుంది.
10 స్టెప్: ఇక్కడ నచ్చిన టీకా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. టీకా కేంద్రాన్ని ఎంచుకున్న అనంతరం బుక్ బటన్పై క్లిక్ చేయాలి. దీనితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
సోమవారం నుంచి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేర్ల రిజిస్ట్రేషన్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్సైట్లో సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి మరుసటి రోజు వరకు వేచి ఉండాలి. ప్రభుత్వం అనుమతించబడిన కేంద్రాల్లో మాత్రమే కొవిడ్ టీకాలను తీసుకోవాలి. కోవిన్ వెబ్సైట్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా కాకుండా మరే ఇతర ప్రైవేట్ వెబ్సైట్లను సంప్రదించకుండా చూసుకోవాలి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడాలి.