న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తిండికి తిప్పలు పడే కాలం దాపురిస్తున్నది. పిడికెడు మెతుకుల కోసం వెతుకులాడే కాలం అతి సమీపంలోనే ఉన్నది. ప్రపంచానికి ఏటా సరిపడా బియ్యం అందిస్తున్న భారత్తోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో వరి పంట విస్తీర్ణం భారీగా పడిపోవటం, ఇప్పటికే ఉన్న నిల్వలను కాపాడుకొనేందుకు అధిక జనాభాగల ఈ దేశాలు ఎగుమతులపై ఆంక్షలు విధించటం ప్రపంచాన్ని ఆహార సంక్షోభం ముందు నిలిపింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో గోధుమల లభ్యత దశాబ్ద కనిష్టానికి పడిపోవటంతో సామాన్యుడికి రొట్టెముక్క కూడా కరువయ్యే పరిస్థితులు రాబోతున్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన మోదీ
ప్రపంచానికి అవసరమైన బియ్యంలో 40 శాతం ఒక్క భారతదేశమే అందిస్తున్నది. పాకిస్థాన్, థాయ్లాండ్, వియత్నాం వంటి తూర్పు ఆసియా దేశాలు కలిసి మరో 30 శాతం అందిస్తున్నాయి. 2021-22 వానకాలం సీజన్లో సమృద్ధిగా వానలు పడి వాతావరణం అనుకూలించటంతో మన దేశంలో బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 111.76 మిలియన్ టన్నులు వచ్చింది. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో ఎక్కడ చూసినా ధాన్యం, బియ్యం రాశులే కనిపించాయి. దీంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణతోపాటు కొన్ని రాష్ర్టాల నుంచి బియ్యం సేకరణ చేయలేమని చేతులెత్తేసింది.
దేశప్రజలకు నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్గోయల్ స్వయంగా ప్రకటించారు. వరిపంట వేయనే వద్దని రాష్ర్టాలను బలంగా కోరారు. వేసవికాలంలో కూడా బియ్యం దిగుబడి భారీగానే రావటంతో ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో ప్రపంచానికి సరిపడా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామని గొప్పగా ప్రకటనలు చేశారు.
ఆ తర్వాత కొద్ది కాలానికే పరిస్థితి తిరగబడింది. 2022-23 వానకాలం సీజన్లో మన దేశంలో తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో వరిపంట సాగు దారుణంగా పడిపోయింది. ఏకంగా 19 లక్షల హెక్టార్లు తగ్గి 399.03 లక్షల హెక్టార్లకే పరిమితమైందని కేంద్ర వ్యవసాయశాఖ ఆగస్టులో లెక్కలు తేల్చింది. దీంతో బియ్యం దిగుమతి 100 మిలియన్ టన్నులకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. అప్పటివరకూ రాష్ర్టాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చటంలో బిజీగా ఉన్న మోదీ సర్కారు, అప్పుడుగానీ మేల్కొనలేదు. పరిస్థితి చేయిదాటి పోతున్నదని గుర్తించి ఆగమేఘాల మీద బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
బాస్మతి మినహా అన్నిరకాల బియ్యం ఎగుతులపై 20 శాతం అదనపు పన్ను విధించింది. నూకల ఎగుమతులను మొత్తానికే నిషేధించింది. ఈ నిర్ణయం అప్పటికే ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోయి తిప్పలు పడుతున్న ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నది. భారత్ నిర్ణయంతో ప్రపంచం ఏకంగా ఆహార సంక్షోభం దిశగా మళ్లుతున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి
పాకిస్థాన్, థాయ్లాండ్, వియత్నాం కలిసి ప్రపంచ బియ్యం అవసరాల్లో 30 శాతం అందిస్తున్నాయి. ఈ వానకాలం సీజన్లో ఈ దేశాల్లో కూడా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వరదలకు పాకిస్థాన్లోని మొత్తం పంటభూమిలో మూడోవంతు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నది. పాక్ ప్రజలు అన్నమో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. వాతావరణ మార్పులు, వర్షాభావంతో వియత్నాం, థాయ్లాండ్లో కూడా సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో ఈ మూడు దేశాలు తమ నిల్వలను కాపాడుకొనేందుకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. దీంతో అంతర్జాతీయంగా బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుత వానకాలం సీజన్లో పంట దిగుబడులు తగ్గే పరిస్థితులు ఉండటంతో భారత్ సహా ఈ దేశాలన్నీ ఇప్పట్లో ఎగుమతులకు మళ్లీ దారులు తెరిచే పరిస్థితి లేదు. దీంతో ఆహార సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.