చిత్తూరు: ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న ఎనిమిది మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.22 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరి అరెస్ట్తో జిల్లా ఇకపై ఎర్ర చందనం స్మగ్లర్లు కనిపించరని పోలీసులు ధీమాగా చెప్తున్నారు.
చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వై రిశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు తాలూకా పోలీసులు 8 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 122 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.22 కోట్ల వరకు ఉండనున్నది. చిత్తూరు డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఇంటెన్సివ్ వెహికల్ చెకింగ్ డ్రైవ్ చేపట్టగా రెడ్ సాండల్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది.
శనివారం తెల్లవారుజామున పోలీసులు ఒక లారీ, రెండు కార్లు, ఒక మోటార్ బైక్ను ట్రాప్ చేశారు. 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి తమిళనాడు రాష్ట్రానికి తరలించి భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.