(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల్లో ఏ రీతిన అక్రమాలు జరుగుతున్నాయో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఉద్యోగుల కుంభకోణం బట్టబయలు చేసింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో అక్రమంగా ఉద్యోగుల నియమాకాలు జరిగాయని శాసనసభా కమిటీ తేల్చడంతో శాసనసభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్ సహా, 250 మంది ఉద్యోగులను స్పీకర్ రీతు ఖండూరీ భూషణ్ తొలగించక తప్పలేదు.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో అసెంబ్లీ సెక్రటరీ లాంటి ఉన్నత పదవిలోని అధికారిని ఈ ఉదంతంలో సస్పెండ్ చేయాల్సి రావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి అసెంబ్లీ ఉద్యోగులను తొలగించడం ఏ రాష్ట్రంలో జరగలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఉద్యోగుల భర్తీపై విచారణ జరిపిన ఉత్తరాఖండ్ శాసనసభా కమిటీ.. భర్తీ ప్రక్రియ ను తప్పుపట్టింది. నియమాలకు విరుధ్ధంగా భర్తీ జరిగిందని తేల్చింది.
నియామకాల కోసం ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవటంతోపాటు, కనీ సం ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీని కూడా సంప్రదించలేదని రిపోర్టులో తప్పుపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16కు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొన్నది. తొలగించిన వారిలో 228 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, మిగతావారు స్వల్పకాలిక ఉద్యోగులు. 2011కు ముందు జరిగిన భర్తీలోనూ అవకతవకలు జరిగాయన్న అనుమానం వ్యక్తమవుతున్నది.