న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియను దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లీటర్కు రూ 100 దాటడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డీజిల్ ధరలు కూడా సెంచరీకి చేరువై చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు రికార్డు స్ధాయికి చేరిన చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. పెట్రో ధరలు వాహనదారులనే కాకుండా సామాన్యులనూ వణికిస్తున్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో సరుకు రవాణా వ్యయం భారమై నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి వస్తువులు, సేవల ధరలు పౌరులకు భారంగా పరిణమించాయి. మరోవైపు పెట్రో ధరలు ఇలాగే పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడిన క్రమంలో చెల్లింపుల సమస్య ఎదురవుతుందనే ఆందోళనకు తోడు ధరల పెంపుతో వినిమయం తగ్గితే ప్రభుత్వానికి రాబడి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులపై కొంత మేర పన్నుల భారం తగ్గించి ఇంధన ధరలు దిగివచ్చేలా చేయడం మేలని సూచిస్తున్నారు.