న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ఇండియా ఎకనమిక్ కాన్క్లేవ్ (ఐఈసీ)లో మాట్లాడుతూ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్యకమైన బ్యాంకింగ్ రంగమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోయిన బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగానే పలు బ్యాంకులను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అయితే అన్ని బ్యాంకులను తాము ప్రైవేటీకరించబోమని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇక ఆర్థిక కార్యకలాపాలు ఇలాగే కొనసాగుతాయని, తాము 2022 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వృద్ధి రేటు 10.5 శాతం అలాగే ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగించే విషయమేనని ఆయన అన్నారు.