ముంబై: ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్నారా?.. అయితే, ఇక ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందే. వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి జరిపే లావాదేవీపై ఇంటర్ చేంజ్ ఫీజు పెంచుతున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది.
ఇతర బ్యాంకు ఏటీఎంల్లో జరిపే ఒక్కో లావాదేవీపై రూ.17 ఇంటర్ ఛేంజ్ ఫీజు సదరు ఖాతాదారు బ్యాంక్ వసూలు చేస్తుంది. ఇంతకుముందు ఇది రూ.15 ఉండేది. ఆర్థికేతర లావాదేవీలకైతే రూ.5 నుంచి రూ.6లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
ఇంతకుముందు ఏటీఎం లావాదేవీలపై చార్జీలను 2012 ఆగస్టులో పెంచామని, 2014లో సవరించామని ఆర్బీఐ తెలిపింది. ఒకే బ్యాంకు ఏటీఎంలో ఖాతాదారులు ఐదు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.
అయితే, మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎంల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునేందుకు అనుమతించింది ఆర్బీఐ. ఇక కస్టమర్ చార్జీలు ఇప్పుడు రూ.20 వసూలు చేస్తున్నారు. 2022 జనవరి నుంచి దాన్ని రూ.21కి పెంచుతున్నట్లు తెలిపింది.
పెంచిన చార్జీలను సదరు ఖాతాదారు బ్యాంక్, ఏటీఎం నిర్వహణ సంస్థ మధ్య పంపిణీ చేస్తారు. అందువల్లే బ్యాంకులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాయల్ చేయొద్దని తమ ఖాతాదారులను నిరుత్సాహ పరుస్తాయి.
ఇంతకుముందు ఈ ఇంటర్ చేంజ్ ఫీజు ఖరారుపై బ్యాంకులు, ఏటీఎం నిర్వహణ సంస్థల మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. ఒక్కో లావాదేవీకి రూ.15 నుంచి రూ.18 ఇంటర్ ఛేంజ్ ఫీజు వసూలు చేయాలని ఏటీఎం నిర్వహణ సంస్థలు కోరాయి.
ఏటీఎం చార్జీలను పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు 2019 జూన్లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీజీ కన్నన్ సారధ్యంలో ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిపారసులు గతేడాది జూలైలో బయటకు వచ్చాయి.
పది లక్షల లోపు జనాభా గల ప్రాంతాల్లో అదే బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా నగదు విత్డ్రాయల్స్కు ఐదు నుంచి ఆరు సార్లకు పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. 10 లక్షల పై చిలుకు జనాభా గల ప్రాంతాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న మూడు సార్ల విత్డ్రాయల్స్ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.
10 లక్షల మందికి పైగా జనాభా గల ప్రాంతాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాయల్స్పై ప్రతి లావాదేవీకి ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.2 పెంచి రూ.17 వసూలు చేయాలని పేర్కొంది.
ఆర్థికేతర లావాదేవీలపై ఫీజును రూ.7లకు పెంచాలని తెలిపింది. 10 లక్షల్లోపు జనాభా గల ప్రాంతాల్లో ఇతర బ్యాంకుల్లో లావాదేవీలన్నింటికీ రూ.3 ఫీజు పెంచాలని సిఫారసు చేసింది.