చెన్నై: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో టెస్టు సిరీస్ల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నుంచి విరామం లభించడంతో తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి విహారయాత్రలో ఉన్నాడు. మంగళవారం కేరళలోని వన్యప్రాణుల అభయారణ్యానికి ఫ్యామిలీతో కలిసి సందర్శించాడు.
ఈ సందర్భంగా తన కుమార్తెతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. పరంబికులం టైగర్ రిజర్వ్లో ఉండగా తీసిన ఫొటోను షేర్ చేస్తూ ..’ప్రకృతి అందం, దాని ప్రాముఖ్యత గురించి పిల్లలకు నేర్పండి. తల్లిదండ్రులుగా మనం వారికి ఇవ్వగల అత్యుత్తమ బహుమతి ఇదే’ అంటూ క్యాప్షన్ జోడించాడు. అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫొటోను కూడా ఇన్స్టాలో పంచుకుంటూ ‘మాస్క్ అప్. దట్స్ ఆల్’ అంటూ వ్యాఖ్యానించింది.