లండన్: ఇంగ్లండ్తో కీలకమైన ఐదు టెస్ట్ల సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీల్లో ఆడుతున్న అశ్విన్ నిరాశపరిచాడు. సర్రే టీమ్ తరఫున సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతడు ఏకంగా 43 ఓవర్లు వేశాడు. అయినా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఆ టీమ్ తరఫున బౌలింగ్ ఓపెన్ చేసింది కూడా అశ్వినే. అయితే మ్యాచ్ 40వ ఓవర్లో అశ్విన్ వికెట్ తీశాడు. టామ్ లామోన్బీని క్లీన్బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత అతనికి మళ్లీ వికెట్ దక్కలేదు. గత ఫిబ్రవరి-మార్చిలో ఇంగ్లండ్.. ఇండియా టూర్కు వచ్చినప్పుడు అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఏకంగా 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు.
ఇప్పుడు ఇంగ్లండ్లోనూ అదే ఫామ్ కొనసాగించాలనుకుంటున్న అశ్విన్.. ప్రత్యేకంగా కౌంటీ మ్యాచ్లో ఆడుతున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడినా.. స్పిన్కు పెద్దగా సహకరించని పిచ్పై అశ్విన్ రాణించలేకపోయాడు. మ్యాచ్లో కేవలం 4 వికెట్లు తీయగలిగాడు. ఆదివారం నుంచి సర్రే తరఫున మ్యాచ్ ఆడుతున్న అశ్విన్.. తొలి రెండు రోజుల్లో మొత్తం 43 ఓవర్లు వేశాడు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ కోసం చూస్తున్న అశ్విన్.. టీమ్లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేయడం విశేషం.