ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక కథానాయికల విషయానికి వస్తే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీలలో ఒకరిని ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంపిక చేయనున్నట్టు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మంథానను కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు టాక్. కొన్ని రోజులుగా హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ తో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ నిమిత్తం లక్నోలో ఉంది. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్ చేరుకుంది. రీసెంట్గా త్రివిక్రమ్ తో స్టోరీ డిస్కషన్ చేసిన రష్మిక ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. ప్రస్తుతం రష్మిక .. ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు.