‘సామి..నా సామి..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో కథానాయిక రష్మిక మందన్న చేసిన నృత్యాలు, పలికించిన హావభావాలు మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ పాటలో రష్మిక మందన్న వేసిన సిగ్నేచర్ స్టెప్తో సోషల్మీడియాలో లక్షలాది షార్ట్ వీడియోస్ రూపొందాయి. అన్నింటికంటే ముఖ్యంగా రష్మిక ధరించిన బంగారు జరీ అంచు కలిగిన ఎర్రచీర, ఆకుపచ్చ జాకెట్ మగువల మనసు దోచుకుంది. ఇప్పుడు ఈ చీరకు రాజస్థాన్ జైపూర్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
శ్రీవల్లి ( ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న పాత్ర పేరు) శారీస్ పేరుతో పేరుపొందిన వస్త్ర దుకాణాలు ఈ చీరల్ని విరివిగా అమ్ముతున్నాయట. దాదాపుగా సినిమాలో రష్మిక ధరించిన చీరనే పోలి ఉండటంతో ఈ శ్రీవల్లి చీరలపై మహిళలు మనసు పారేసుకుంటున్నారని చెబుతున్నారు. మార్కెట్లో ఈ చీర తాలూకు ఫొటోల్ని నెటిజన్లు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. రాబోవు దేవీనవరాత్రి ఉత్సవాల్లో ధరించడానికి ఈ చీర బాగుంటుందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారట. ‘పుష్ప’ సినిమాతో రష్మిక మందన్న దేశవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకోవడమే కాదు..కాస్ట్యూమ్స్ పరంగా కూడా ట్రెండ్ క్రియేట్ చేసిందని అంటున్నారు.