అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప 2’ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ అక్టోబర్ రెండో వారంలో ప్రారంభమవుతుందని సమాచారం. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్నారు. ద్వితీయ భాగం సినిమా సెట్స్ మీదకు వెళ్తున్న సందర్భంగా తొలి చిత్ర విజయాన్ని, అది తీసుకొచ్చిన పేరు ప్రతిష్టలను గుర్తు చేసుకున్నారు హీరో అల్లు అర్జున్, నాయిక రష్మిక. అల్లు అర్జున్ స్పందిస్తూ…‘మేము ఊహించిన దానికంటే భారీ విజయాన్ని పుష్ప సాధించి ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా లేకుంటే ఇంత పేరు దక్కించుకునేందుకు నాకు మరో ఇరవై ఏళ్లు పట్టేదేమో. భారీ అంచనాలను అందుకునేలా ద్వితీయ భాగాన్ని రూపొందిస్తాం’ అని చెప్పారు. రష్మిక మాట్లాడుతూ…‘మరికొద్ది రోజుల్లో పుష్ప 2 సెట్స్లోకి వెళ్తాం. ఈ సినిమా సక్సెస్ నాకు చాలా పేరు తీసుకొచ్చింది. సినిమా విడుదలైన రెండు మూడు నెలల దాకా నాకు ఫోన్స్, మేసేజ్లు వస్తూనే ఉన్నాయి’ అని చెప్పింది. ఇక ఈ సినిమా గురించి మరో వార్త చక్కర్లు కొడుతున్నది. అదేంటంటే ఈ సినిమాలో స్పెషల్ పాట కోసం కాజల్ అగర్వాల్ను సంప్రదిస్తున్నారట. మొదటి భాగంలో ‘ఊ అంటావా మావ..’ పాటలో సమంత ఆడిపాడింది. ఈ పాట సూపర్హిట్టయి సినిమా విజయంలో భాగమైంది.