చిత్రసీమలో ఐదు వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘కిరిక్పార్టీ’ (2016) సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ అమ్మడు అనతికాలంలోనే దక్షిణాదిన అగ్ర కథానాయికగా ఎదిగింది. సినీ రంగంలో ఐదేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా రష్మిక మందన్న సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సినీ ప్రయాణంలో తెలుసుకున్న విషయాల గురించి వివరించింది. సమయం వేగంగా గడచిపోతున్నదని, ప్రతిరోజు మధురజ్ఞాపకాల్ని ప్రోది చేసుకోవాలని చెప్పింది. హృదయపు లోతుల్లోంచి సంతోషాన్ని ఆస్వాదించాలని సూచించింది. ‘జీవితంలో ఏదీ సులభంగా లభించదు. మనకు ఇష్టమైన దానికోసం పోరాడాల్సిందే. ఓపికతో నిరీక్షిస్తే అన్ని పనులు ఫలవంతమవుతాయి. సాధ్యమైనంత వరకు భావోద్వేగాల తాలూకు భారాన్ని మోయడం మానాలి. కొన్ని విషయాల్ని పట్టించుకోకపోవడమే మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని ఎప్పుడూ సంతోషపెట్టే పనుల్లో నిమగ్నమైపోవాలి’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.