బంజారాహిల్స్, ఏప్రిల్ 18: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 87 ఏండ్ల వృద్ధుడికి జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రామకృష్ణ శాస్త్రి అనే వృద్ధుడి గుండెలోని ఎడమ గదుల మధ్యన వాల్వ్ పూర్తిగా మూసుకుపోయి రక్తం లీకవుతున్నది. వైద్య పరిభాషలో దీనిని మిట్రాల్ వాల్వ్ రెగర్జిటేషన్ అంటారు. దీనిని ఓపెన్ హార్ట్ సర్జరీతో సరిచేస్తారు. కానీ, వయసు ఎక్కువగా ఉన్న కారణంగా రామకృష్ణ శాస్త్రికి సర్జరీ వీలుకాలేదు. దీంతో అపోలో వైద్యులు అత్యాధునిక మిట్రాక్లిప్ ఇంప్లాంట్ పద్ధతిలో అతితక్కువ కోతతో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఇది తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారి అని అపోలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీశ్, డాక్టర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు.